Blogger Tips and TricksLatest Tips And TricksBlogger Tricks

మంగళవారం, డిసెంబర్ 31, 2013

దత్తపది: చెక్కు - సైను - మనీ - డ్రా ..భారతార్థం...స్వేచ్ఛా ఛందం

తేది: డిసెంబర్ 30, 2013 నాటి శంకరాభరణంలోని
దత్తపది శీర్షికన ఇచ్చిన
చెక్కు-సైను-మనీ-డ్రా పదాలను ఉపయోగించి,
భారతార్థంలో నచ్చిన ఛందంలో రాయమనగా
నేను రాసిన తేటగీతి


(బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించగా, ద్రుపదమహారాజు మెచ్చుకొన్న సందర్భము)

"నేనె విలుకాఁడఁ జూడుఁ"డంచెక్కుపెట్టి,
సొగసై, నునుపైన విశుద్ధ మత్స్య
యంత్రమునుఁ గొట్ట, "నెంత నియమమ నీకు,
బ్రాహ్మణా!"యనె ద్రుపదరా, డ్రాజసమున!

(చివరి పాదమును బ్రాహ్మణా!" యనె ద్రుపదరా, డ్రామ నిడుచు! అని కూడా చదువుకొనగలరు)
  

4 కామెంట్‌లు:

  1. పద్యం బాగుంది.

    సొగసై, నునుపైన అన్నది కొంత కృతకం కాని పూరణాల్లో ఇలాంటివి సాధారణమే కాబట్టి ఫరవాలేదు.
    నియమమ నీకు అన్నది బాగుంది.
    కాని ద్రుపదరా డ్రాజసమున అన్నది విచార్యం. ఇలా అంటే రాజసముతో ద్రుపదరాజు అన్న అర్థం బదులుగా ద్రుపదరాజు యొక్క రాజసము వలన అన్న అర్థం వస్తున్నది. యోచించండి.

    మొత్తం మీద చక్కని పూరణ. అభినందనలు.

    రిప్లయితొలగించండి
  2. మీరన్నది సబబుగనే యున్నటులు తోచుచున్నది. "...ద్రుపదరా, డ్రాజసమున" అని ద్రుపదరాట్ తరువాత కామా పెట్టినచో సరిపోవునని భావింతును.

    అయినను చివరి పాదమును..."బ్రాహ్మణా! యనె ద్రుపదరా, డ్రామనిడుచు!"అని సవరింతును. సవరణ తదుపరి...

    "నేనె విలుకాఁడఁ జూడుఁ" డం చెక్కుపెట్టి,
    సొగసై, నునుపైన విశుద్ధ మత్స్య
    యంత్రమునుఁ గొట్ట, "నెంత నియమమ నీకు,
    బ్రాహ్మణా!" యనె ద్రుపదరా, డ్రామ నిడుచు!

    అని యగును. పరిశీలింపుడు. స్పందించి, విశ్లేషించినందులకు కృతజ్ఞుడను.

    రిప్లయితొలగించండి
  3. గుండువారూ, సవరించిన పద్యం బాగున్నది. తెలుగు కావ్యముల యందు గద్యపద్యములలో విరామచిహ్నముల నుంచుట సంప్రదాయము కాదు కాని యాధునికులు పద్యములలో విరామచిహ్మముల నుంచుట పరిపాటిగ నున్నట్లు గమనించు చున్నాను. విరామచిహ్నముల నుంచుట దోసమని కాదు గాని యావశ్యకము మాత్రము కాదనియే నా యభిప్రాయము. విరామచిహ్మముల నుంచుట వలన భాషలో పట్టులేని వారలకు వాని వలన కొంత ప్రయోజనము కలుగ వచ్చుననుట నిర్వివాదము. అట్లే కవియే తన పద్యమును యెట్లు సరిగా నన్వయము చేసుకొన వలయునో చెప్పుట పాఠకుని తక్కువగా గొనుట వంటిదను భావనను కలిగించు నన్నది కూడ ఆలోచనీయము. నా వ్రాతలయందు, ముఖ్యముగా పద్యముల యందు విరామచిహ్నముల నుంచుటకు నిష్టపడను. నా యభిప్రాయము మీతో పంచుకొనుటకు చెప్పితిని గాని, విరాహచిహ్నసహితముగా వ్రాయబడిన పద్యముల నాక్షేపించను గూడ. మరల నొకమారు చదివిచూచితిని. పరిషృతపద్యము చక్కగా నున్నది.

    రిప్లయితొలగించండి
  4. తాడిగడపవారూ, విరామ చిహ్నమునుంచితేకాని, యన్వయము కుదురలేదుకదా! మీరు విరామచిహ్నములు లేకయే వ్రాతురు కావున మీకు సులభముగ నన్వయము కావలసినది. కాని, చిహ్నముంచిననే యన్వయమైనది. దీనినిబట్టి యేమి యర్థమగుచున్నది. పద్య పఠితలు మనమున విరామ చిహ్నములను భావించుకొనవలయుననియే కదా! చిహ్నము లేనిచో భావించుకొనవలయును. అన్వయము కొంత సమయము తీసికొనును. చిహ్నములున్నచో వెంటనే యన్వయమగును. చిహ్నములుంచుట స్వీయాభిమతము. నేటి కాలమున చిహ్నములుంచుట ద్వారముననే యన్వయము చేసికొనువారుందురు. చిహ్నములు లేకున్న కొంత యిబ్బంది పడుదురు. లేదా తప్పుగా నన్వయించుకొందురు.
    నా పద్యము తమకు నచ్చినందులకు,మరల వ్యాఖ్యానించినందులకు ధన్యవాదములు. స్వస్తి.

    రిప్లయితొలగించండి